by సూర్య | Mon, Jan 10, 2022, 05:52 PM
చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వర్మతో భేటీ వివరాలను మీడియాకు వెల్లడించారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం జీవో నెం.35 ప్రకారం సినిమా టిక్కెట్ ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అక్రమ చర్యలు తీసుకోలేదని వర్మకు వివరించినట్లు తెలిపారు. సినిమా టిక్కెట్ల విషయంలో మేం కొత్తగా సృష్టించిందేమీ లేదన్నారు.
‘‘మేం ఇందులో కొత్తగా సృష్టించడం ఏమి లేదు... ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు.. చట్టం అందరికీ ఒకేలా ఉండదు.. చట్టం ఎవరికీ చుట్టం కాదు. చట్టం అందరికీ ఒకటే. రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలి, పసుపు లైటు వెలిగితే అటూ ఇటూ చూసుకోవాలి, పచ్చ లైటు వెలిగితే ముందుకు పోవాలి. ఇది అందరికీ రూలు. 2013లో జీవో నెం.100లో పేర్కొన్న దానికంటే ఎక్కువ టిక్కెట్ ధరను పెంచారు. టికెట్ ధరలను మరింత పెంచడంపై ఎవరికైనా అభిప్రాయం ఉంటే, వారు మేము ఏర్పాటు చేసిన కమిటీతో లేదా మాతో మాట్లాడవచ్చు. ఈరోజు వర్మగారు వచ్చారు కాబట్టి ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. వారి అభిప్రాయాలను కచ్చితంగా కమిటీకి నివేదిస్తాం’’ అని నాని అన్నారు.