by సూర్య | Wed, Nov 24, 2021, 04:09 PM
భారీ బడ్జెట్ సినిమాలకు ఏపీ సర్కారు బిగ్ షాక్. ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ సినిమా టికెట్ల విక్రయాల కోసం సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని శాసనసభలో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా నాని మాట్లాడారు. 'సినిమా థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాల్సిన చోట ఇష్టారాజ్యంగా ఆరేడు వేస్తున్నారు. బెనిఫిట్ షోల పేరిట టికెట్కు రూ.500 - రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఏ చట్టం మమ్మల్ని ఆపలేదని కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ చట్టమైనా తమకు అనుకూలంగా ఉండాలని ఇంకొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమా హాళ్లలో జరుగుతున్న వ్యవహారాలకు ఆన్లైన్ టికెట్ ప్రక్రియ ద్వారా అడ్డుకట్ట వేయొచ్చు. ఇకపై ప్రభుత్వం చెప్పిన సమయాల్లో మాత్రమే సినిమాను ప్రదర్శించాలి. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే టికెట్ ధరలు నిర్ణయించాల్సి ఉంటుంది. బస్సు, రైలు టికెట్లు, విమాన టికెట్ల తరహాలోనే ఇంటి వద్ద నుంచే సినిమా టికెట్లనూ ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు.
కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు వచ్చిన కలెక్షన్లకు, జీఎస్టీ చెల్లింపులకు పొంతన లేదు. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు యథావిధిగా ఆన్లైన్ విధానం ద్వారా వస్తాయి. ప్రభుత్వంపై బురద జల్లడానికి సినిమా వాళ్లు ప్రయత్నిస్తే అర్థముంది.. రాజకీయ పార్టీలకెందుకు?. ఆన్లైన్ టికెట్ల వ్యవహారంపై డిస్ట్రిబ్యూటర్లకూ, నిర్మాతలకూ లేని అభ్యంతరం ఇతరులకెందుకు? కొందరు సినిమా హాళ్ల రాబడులు చూపించి అప్పులు తీసుకుంటామని నిందలు వేస్తున్నారు. ఆన్లైన్ పోర్టల్ను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఆర్బీఐ గేట్వే ద్వారా ఏ రోజుకారోజు సినిమా హాళ్లకు డబ్బు చెల్లింపులు చేస్తాం. ప్రజలకు మెరుగైన సేవలందించే చట్టం ఇది. వారంతా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం ' అని పేర్ని నాని సభకు వివరించారు.
Latest News