by సూర్య | Tue, Oct 26, 2021, 12:08 PM
తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో దారుణం జరిగింది. భర్త పెడుతున్న చిత్రహింసలు భరించలేక ఓ భార్య తన భర్తనే కడతేర్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అరుప్పుకొట్టైలోని గాంధీనగర్ పిళ్లైయార్కోయిల్ వీధిలో రేవతి (36), రాజారామ్(45) దంపతులు నివసిస్తున్నారు. వారికి తొమ్మిదేళ్లు ఏడేళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. రాజారామ్ డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. అతడు కొన్ని నెలల నుంచి మద్యానికి బానిసగా మారాడు. రోజూ తాగి వచ్చి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. రేవతి భర్త ప్రవర్తనతో విసిగిపోయింది. అతడేమో భార్యను తిడుతూ, కొడుతూ హింసించడం మొదలుపెట్టాడు. ఇటీవల రాజారాం రోజూలానే మద్యం తాగి ఇంటికి వచ్చి రేవతితో గొడవపడ్డాడు. దీంతో రేవతి క్షణికావేశంలో కొడుకు ఆడుకునే క్రికెట్ బ్యాట్ తో రాజారాంపై దాడి చేసింది. ఈ దాడిలో రాజారాం తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రేవతిని అరెస్ట్ చేశారు. తల్లి చేతిలోనే తండ్రి హత్యకు గురికావడం, తండ్రి హత్య కేసులో తల్లి జైలుకెళ్లడంతో వీళ్ల ఇద్దరు కొడుకుల పరిస్థితి దయనీయంగా మారింది.
Latest News