by సూర్య | Tue, Oct 26, 2021, 11:46 AM
భారత్-పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరముందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అయితే, టి-20 క్రికెట్ మ్యాచ్లో తమ జట్టు విజయం సాధించిన తరుణంలో ఈ అంశంపై చర్చించడం సరికాదన్నారు. సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ఇమ్రాన్ఖాన్ మూడు రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా రియాద్లో సోమవారం ఏర్పాటుచేసిన పాక్-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరం సమావేశంలో ఇమ్రాన్ మాట్లాడినట్టు డాన్ పత్రిక పేర్కొంది.''భారత్, పాకిస్థాన్లు పరిష్కరించుకోవాల్సిన సమస్య ఒక్కటే- కశ్మీర్ అంశం. కశ్మీర్ ప్రజల, మానవ హక్కులకు సంబంధించిన విషయమిది. ఐరాస భద్రత మండలి హామీ ఇచ్చిన ఈ హక్కులు వారికి దఖలు పడితే చాలు. ఉభయ దేశాల మధ్య వేరే సమస్యలేవీ లేవు. చైనాతో మాకు మంచి సంబంధాలే ఉన్నాయి. భారత్తో సంబంధాలు కూడా మెరుగుపడితే రెండు దేశాలు ఎంత శక్తిమంతంగా ఉంటాయో ఊహించండి. అప్పుడు నాగరిక సమాజాలుగా అవి మరింత ముందుకువెళ్లే అవకాశం ఉంటుంది. అదే జరిగితే... పాకిస్థాన్ మీదుగా మధ్య ఆసియా ప్రాంతాన్ని భారత్ సులభంగా చేరుకునే వీలుంటుంది. పాకిస్థాన్కు కూడా పెద్ద మార్కెట్లు చేరువవుతాయి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి నిత్యం మారుతూ ఉంటాయి. టి-20 మ్యాచ్లో భారత్పై పాకిస్థాన్ జట్టు విజయం సాధించిన తరుణంలో ఉభయ దేశాల సంబంధాలపై మాట్లాడటం సరికాదు'' అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
Latest News