by సూర్య | Tue, Oct 26, 2021, 08:23 AM
ఇండియాలో తాజాగా మరో వేరియంట్ బయటపడింది. అదే ఏవై.4 వేరియంట్. ఈ వేరియంట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో బయటపడింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఈ వేరియంట్ బారిన పడడం ఆందోళన కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీలోని జాతీయ అంటువ్యా ధుల నియంత్రణ కేంద్రం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం, ఆరుగురు వ్యక్తులకు ఏవై.4 రకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరి నమూనాలను జన్యు పరీక్షల కోసం వైద్యులు సెప్టెంబరులో ఢిల్లీకి పంపారు. తాజాగా ఫలితాలు వెలువడ్డాయి. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దేశం లో ఏవై.4 వేరియంట్ కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. ఈ వేరియంట్ బారిన పడిన బాధితులంతా కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారే. చికిత్స తర్వాత వారంతా కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు. ఈ ఆరుగురు వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న మరో 50 మందికి కూడా టెస్టులు చేయగా వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందని వైద్యాధికారి వెల్లడించారు. ఏవై.4 ఓ కొత్త రకం వేరియంట్ అని, దీనికి సంబంధించిన సమాచారం ఎక్కువగా లేదని ఇండోర్ లోని మైక్రోబయాలజీ విభాగానికి చెందిన అధికారి డాక్టర్ అనితా మూతా పేర్కొన్నారు.
Latest News