by సూర్య | Mon, Oct 25, 2021, 06:00 PM
టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి భారత ప్రధాన పేసర్ మహ్మద్ షమీయే కారణమంటూ కొందరు దురాభిమానులు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. షమీ పాక్కు అమ్ముడుపోయాడు, అతన్ని పాక్కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. సోషల్మీడియా వేదికగా షమీపై జరుగుతున్న ఈ దాడిని టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ ఖండించారు.
షమీపై దాడి దిగ్భ్రాంతికరమని, జట్టు మూకుమ్మడిగా విఫలమైతే షమీ ఒక్కడు మాత్రం ఏం చేయగలడని మద్దతుగా నిలిచారు. షమీ ఓ ఛాంపియన్ బౌలర్ అని.. టీమిండియా క్యాప్ ధరించిన ప్రతి ఆటగాడు తమ హృదయాల్లో భారతీయత కలగి ఉంటాడని.. షమీ తర్వాతి మ్యాచ్లో రెచ్చిపోవాలని ఆకాంక్షించారు. గతంలో టీమిండియా.. పాక్ చేతిలో ఓడినప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని, కొందరు అల్లరి మూకులు ఉద్దేశపూర్వకంగా మాటల దాడులకు తెగబడుతున్నారని, ఇది ఏ మాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
ఇదే అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం స్పందించారు. ఆటలో గెలుపోటములు సహజమని, జట్టులో 11 మంది సభ్యులుంటే, ఒక్కరినే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. నెట్టింట జరుగుతున్న ఇలాంటి దాడులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. కాగా, పాక్తో జరిగిన మ్యాచ్ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో షమీ 3.5 ఓవర్లు బౌల్ చేసి ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు.
Latest News