by సూర్య | Mon, Oct 25, 2021, 03:38 PM
జులై- సెప్టెంబరు త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్ అద్భుతమైన ఫలితాలు ప్రకటించడంతో సోమవారం స్టాక్మార్కెట్ ట్రేడింగ్లో ఈ సంస్థ షేర్లు భారీగా దూసుకెళ్లాయి. ఓ దశలో 14 శాతానికి పైగా ఎగబాకి బీఎస్ఈలో రూ.858 వద్ద.. ఎన్ఎస్ఈలో రూ.867 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఐసీఐసీఐ మార్కెట్ విలువ రూ.6 లక్షలకు చేరువయ్యింది. రికార్డు స్థాయి లాభాలతో పాటు నిరర్థక ఆస్తులు తగ్గడంతో మదుపర్లలో విశ్వాసం, ఉత్సాహం పెరిగింది.
ఐసీఐసీఐ బ్యాంక్ స్టాండలోన్ పద్ధతిలో ఈసారి అత్యధిక త్రైమాసిక లాభాన్ని ప్రకటించింది. అన్ని విభాగాల్లో రుణాల వృద్ధికి తోడు మొండి బకాయిలు తగ్గడంతో నికరంగా రూ.5,511 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.4,251 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.23,651 కోట్ల నుంచి రూ.26,031 కోట్లకు పెరిగింది. ఏకీకృత ప్రాతిపదికన కూడా బ్యాంక్ రూ.6,092 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది కూడా ఐసీఐసీఐ బ్యాంక్కు ఒక త్రైమాసికంలో అత్యధిక లాభమే. 2020-21 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.4,882 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.39,289.60 కోట్ల నుంచి స్పల్పంగా పెరిగి రూ.39,484.50 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 5.17 శాతం నుంచి 4.82 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 1 శాతం నుంచి 0.99 శాతానికి మెరుగయ్యాయి.
Latest News