by సూర్య | Wed, Jun 09, 2021, 10:36 AM
ముంబయి: నైరుతి రుతుపవనాల ఆగమనంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయి భారీ వర్షంతో తడిసిముద్దయింది. బుధవారం ఉదయం రుతుపవనాలు మహారాష్ట్రను తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ముంబయి సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచే కుండపోత కురుస్తోంది. వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిన్న రాత్రి 8.30 గంటల నుంచి ఈ ఉదయం 5.30 గంటల వరకు ముంబయిలో కొలాబాలో అత్యధికంగా 65.4 మిల్లీమీటర్లు, శాంతాక్రూజ్లో 50.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో ఐదు రోజుల పాటు ముంబయి, శివారు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. రాయ్గఢ్, ఠాణె, పాల్ఘర్, నాసిక్ తదితర జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయని తెలిపింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 10న నైరుతి రుతుపవనాలు ముంబయిని తాకుతాయి. అయితే ఈ ఏడాది ఒక రోజు ముందే వచ్చినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, బెంగాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
Latest News