by సూర్య | Fri, Apr 09, 2021, 10:33 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన సీఎంగా జగన్ రికార్డులకెక్కారని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అప్పులపై కేంద్రం లేఖ జగన్ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతోందని విమర్శించారు. ఇకపై కనిష్ట అప్పులు, గరిష్ట చెల్లింపులతో ఏపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టినట్లైందని దుయ్యబట్టారు. కేంద్రం పేర్కొన్న రూ.49,280కోట్ల మూలధన వ్యయం, రాష్ట్రం చేసిన రూ.19వేల కోట్ల మూలధన వ్యయం ఎక్కడ అని ప్రభుత్వాన్ని యనమల నిలదీశారు. హద్దూపద్దు లేని రెవెన్యూ వ్యయం (132 శాతం), రెవెన్యూ లోటు 3-4శాతం, ద్రవ్య లోటు 13శాతం, ప్రాథమిక లోటు 2-3శాతం, జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి 35శాతం వంటివన్నీ జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ఠగా పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులకు గుండుసున్నా.. పేదల సంక్షేమానికి పంగనామాలు పెడుతోందని యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు.
Latest News