by సూర్య | Tue, Apr 06, 2021, 12:51 PM
ఫోన్ పే యూజర్ కు ఓ సైబర్ నేరగాడు టోకరా వేశాడు. కస్టమర్ కేర్ పేరు చెప్పి రూ.97 వేలు తస్కరించాడు. దీంతో ఆ బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. గుంటూరు ఐపీడీ కాలనీకి చెందిన నాగరాజు తన స్నేహితుడికి రూ.400 పంపించాడు. అయితే ఆ డబ్బు అతడి స్నేహితుడి ఖాతాలో జమ కాలేదు. ఫోన్ పే కస్టమర్ కేర్కు ఫోన్ చేసి సమస్యను వివరించాను. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీ ప్రసాద్ అనే వ్యక్తి నుండి నాగరాజుకు ఫోన్ వచ్చింది. తాను ఫోన్ పే కస్టమర్ కేర్ నుండి మాట్లాడుతున్నాను అని చెప్పాడు.
రూ.400 జమ చేస్తామని మీ ఫోన్ కు వచ్చిన వెరిఫికేషన్ కోడ్ చెప్పాలని కోరాడు. నిజమని నమ్మి ఆ కోడ్ చెప్పగానే రూ.49,248 తీసినట్లు మెసేజ్ వచ్చింది. ఇదేంటని అడుగగా మరో వెరిఫికేషన్ వస్తుందని అది చెప్తే మీ డబ్బు తిరిగి మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పడంతో మరో సారి కోడ్ చెప్పాడు. ఈ సారి రూ. 48,657 తీసినట్లుగా మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో సోమవారం బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కాగా అపరిచితులకు మీ ఓటీపీ, వ్యక్తిగత సమాచారం చెప్పకూడదని అధికారులు ఎంత చెప్పినా కొంతమంది మాత్రం ఇంకా ఇలా మోసపోతూనే ఉన్నారు.
Latest News