by సూర్య | Tue, Apr 06, 2021, 11:35 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) మంగళవారం వైభవంగా నిర్వహించింది. ఈనెల 13న ప్లవనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున స్వామివారికి సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్పై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షిణగా వచ్చి ఆలయ శద్ధి కార్యక్రమం నిర్వహించారు.
ఆనందనిలయం, బంగారు వాకిలి, శ్రీవారి ఆలయంలోని ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామగ్రిని శుభ్రం చేశారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మానెడ్డితోపాటు తితిదే బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Latest News