by సూర్య | Thu, Mar 25, 2021, 01:32 PM
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 26వ తేదీన భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఈ బంద్ ను అందరూ కలిసి విజయవంతం చేయాలంటూ రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. దాదాపు 4 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 26న ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.
ఈ సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రోడ్లు క్లోజ్ కానున్నాయి. మార్కెట్లు, జనసాంద్రిత ప్రదేశాలను మూసివేయనున్నారు. రైతు సంఘాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, దీనికి సంబంధించి సీఎం జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 1 గంట వరకు బంద్ కానున్నాయని, బంద్ సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. కాగా, భారత్ బంద్ కు ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి.
Latest News