by సూర్య | Tue, Jan 19, 2021, 01:30 PM
బ్రిస్బేన్: అద్భుతం.. అనూహ్యం.. అసాధారణం.. ఆస్ట్రేలియాపై టీమిండియా అనితర సాధ్యమైన విజయం సాధించింది. 32 ఏళ్లుగా ఓటమెరుగని బ్రిస్బేన్లో కంగారూల పని పట్టింది. గబ్బా కోటను బద్ధలు కొట్టింది. 3 వికెట్ల తేడాతో చివరి టెస్ట్లో గెలిచి 2-1తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. యువ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ (91), రిషబ్ పంత్(89 నాటౌట్) ఫైటింగ్ ఇన్నింగ్స్తోపాటు ఆస్ట్రేలియా పేసర్ల బౌన్సర్లకు శరీరమంతా గాయపడినా పోరాడిన పుజారా (56) టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టారు. 328 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ఛేదించడం విశేషం. చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్.. టెస్ట్ క్రికెట్లోని అసలైన మజాను రుచి చూపించింది.
రికార్డు చేజ్..
ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడు వందలకుపైగా స్కోర్లు చేజ్ చేసి గెలవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై. అందులోనూ ఇప్పటి వరకూ ఎప్పుడూ గెలవని బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఇంత భారీ స్కోరు ఛేదించడం అనేది సాధారణ విషయం కాదు. చివరి రోజు వికెట్ నష్టపోకుండా 4 పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. 18 పరుగుల దగ్గరే రోహిత్ శర్మ (7) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. గిల్తో కలిసి పుజారా ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 114 పరుగులు జోడించారు. ఆ తర్వాత రెండో సెషన్లో సెంచరీకి కేవలం 9 పరుగుల దూరంలో శుభ్మన్ గిల్ (91) ఔటయ్యాడు. ఆ కాసేపటికే రహానే (24) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 167 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
పంత్ సూపర్ ఇన్నింగ్స్
ఈ దశలో పుజారాతో జత కలిసిన పంత్.. మరోసారి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సిడ్నీ టెస్ట్లో 97 పరుగులు చేసి మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించిన పంత్.. ఈసారి కూడా పుజారాతో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. మొదట్లో ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ మ్యాచ్ను డ్రాగా ముగించడంపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్లు బౌన్సర్లతో బెంబేలెత్తించే ప్రయత్నం చేశారు. ఆ బౌన్సర్లకు పుజారా శరీరంపై చాలా గాయాలయ్యాయి. అయినా అతను మాత్రం మొక్కవోని పట్టుదలతో క్రీజులో నిలిచాడు. చివరికి చివరి సెషన్లో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత పంత్ అటాకింగ్ మొదలైంది. డిఫెన్స్ పడకుండా అటాకింగ్కు దిగడంతో ఆస్ట్రేలియా బౌలర్లు డిఫెన్స్లో పడిపోయారు. 100 బంతుల్లో టెస్టుల్లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పంత్.. తర్వాత కూడా తన దూకుడు కొనసాగించాడు. చివరికి టీమిండియాకు చారిత్రక విజయాన్ని సాధించి పెట్టాడు.
Latest News