by సూర్య | Tue, Jan 19, 2021, 12:36 PM
మొదటి టెస్టులో ఓటమి. రెండో టెస్టులో ప్రతీకారం. మూడో టెస్టు డ్రా. ఇప్పుడు నాలుగో టెస్టు ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏమవుతుంది? ఎవరు నెగ్గుతారు..బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎవరు చేజిక్కించుకుంటారు? ఇండియా చెంతనే ఉంటుందా? ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుందా? ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులకు తెగని ప్రశ్న ఇది. నాలుగో టెస్టులో గెలవాలంటే 328పరుగులు చేయాలి. రెండో ఇన్నింగ్సులో నాలుగో రోజు ఆట పూర్తయ్యే (వర్షం కారణంగా ఇంకా 24ఓవర్లు ఉండగానే) భారత్ వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(4), శుభమ్ గిల్(0) ఆడుతున్నారు. వాస్తవానికి టెస్టుల్లో టార్గెట్ చేజింగ్ కష్టమైన పని. అదీ వర్షం పడుతున్న పిచ్పై గెలవడం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఈ మ్యాచ్లో వరుసగా మూడు రోజులు వర్షం కారణంగా ఆట ముందే ఆగిపోయింది. రేపు అలాగే ఆగిపోతే టెస్ట్ డ్రా అవ్వడంతో పాటు సిరీస్ కూడా డ్రా అవ్వడం ఖాయం. ఫలితం వచ్చే అవకాశాలు ఈ టెస్టులో తక్కువే. ఆట జరిగినంత సేపు భారత ప్లేయర్లు నిలకడగా ఆడి, ప్రత్యర్థుల వ్యూహంలో చిక్కకుండా ఉండాలి. మూడో టెస్టు డ్రా అవ్వడానికి ఇదే వైఖరి కారణం. హనుమ విహారి, అశ్విన్లు అద్భుతమైన పోరాట పటిమను కనబరిచి ఆ టెస్టును డ్రా చేశారు. ప్రత్యర్థికి కొరకరాని కొయ్యలా మారారు. భారత్ గెలవాలని ఆశించిన వారికి ఆశాభంగమైంది అది వేరే సంగతి. వారిని ట్రోల్ కూడా చేశారు సోషల్ మీడియాలో. నాలుగో టెస్టులో ఓటమిని పీకమీదకు తెచ్చుకుంటారా? ఆదినుంచి ధాటిగా ఆడి గెలుస్తారా? అక్కరలేదనుకుని జాగ్రత్తగా ఆడి డ్రాతో సరిపెట్టుకుంటారా? చూడాల్సిందే?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ విజయం దిశగా సాగుతోంది. 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచి సవాల్ విసిరిన ఆసీస్కు అదే రీతిలో భారత బ్యాట్స్మెన్స్ సమాధానం చెబుతున్నారు. నాలుగు పరుగుల ఓవర్నైట్ స్కోర్తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్ శుభమన్ గిల్తో జతకట్టిన చతేశ్వర పుజారా ఇన్నింగ్స్ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్మెన్ గిల్ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ అజింక్యా రహేనే 24 పరుగులకే పెవిలియన్ బాట పట్టి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసీస్ బౌలర్లు ధీటుగా ఎదుర్కొన్న పుజారా 211 బంతుల్లో 56 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 228/4. విజయానికి ఇంకా భారత్ 85 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రిజ్లో పంత్ (34), మయాంక్ అగర్వాల్ ఉన్నారు. వీరిద్దరు ఔట్ అయితే మ్యాచ్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన (5/73)తో చెలరేగాడు. మరో పేసర్ శార్దుల్ ఠాకూర్కు 4 వికెట్లు దక్కాయి.
ఆస్ట్రేలియాతో ఆఖరిదైన నాలుగో టెస్టులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్ టెస్టులో సిరాజ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనను మంత్రి కేటీఆర్ కొనియాడారు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ వికెట్ల వేట సాగించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాదుకు చెందిన మన కుర్రాడు అదరగొడుతున్నాడంటూ కేటీఆర్ ప్రశంసించారు. తండ్రిని కోల్పోయిన విషాదకర పరిస్థితిలోనూ ఈ విధంగా రాణించడం మామూలు విషయం కాదని కొనియాడారు. "నీ అద్భుత ప్రదర్శన భారత జట్టు ముందర సిరీస్ గెలిచే అవకాశాన్ని నిలిపింది. మీ నాన్న పైనుంచి దీవెనలు అందజేస్తూ నీ ఆటతీరు పట్ల కచ్చితంగా గర్విస్తాడు" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ 19.5 ఓవర్లు విసిరి 73 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో తొలిసారి 5 వికెట్లు తీసిన సిరాజ్ పై పొగడ్తల వర్షం కురుస్తోంది. గబ్బా స్టేడియంలో ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన ఐదో ఇండియన్ బౌలర్గా సిరాజ్ నిలిచాడు.
నాటకీయ మలుపులతో సాగుతున్న ఆఖరి టెస్టు మరింత పసందుగా మారింది. నాలుగో రోజున భారత బౌలర్ల వికెట్ల జోరు.. అటు ఆసీస్ పరుగుల హోరుతో ఇరు జట్ల మధ్య సమాన పోరే నెలకొంది. ఏమైనా భారత అభిమానులుగా మ్యాచ్ గెలవాలనే ఆశిద్దాం. కానీ ఇక్కడో చిన్న చిక్కుంది. బ్రిస్బేన్లోని గాబా స్టేడియంలో ఆతిథ్య జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అలాగే ఇండియా ఒక్క మ్యాచ్ గెలవలేదు. ఇది చాలు ఫలితాన్ని అంచనా వేయడానికి. మరి మ్యాచ్ గెలుస్తామా? లేదా అన్నది తెలియాలంటే వేచిచూడాల్సిందే.