by సూర్య | Sat, Jan 16, 2021, 01:23 PM
కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం వైయస్సార్ బీమాను ఆన్లైన్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పేదలు భవిష్యత్తులో ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు జి.కొండూరు మండలం లో సుమారు 38 శాతం మాత్రమే దరఖాస్తులు ఆన్లైన్ చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ వెబ్సైటు క్లోజ్ అయ్యే దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి ఆన్లైన్ చేయాలని పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కోరుతున్నారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని ఎంతో కృషి చేస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పేదలు ఇబ్బందులు పడతారని పలువురు పేర్కొంటున్నారు. వైయస్సార్ బీమా వల్ల పేద కుటుంబాల్లోని వ్యక్తులు చనిపోతే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం వచ్చే అవకాశం ఉంది.
ఈ పథకం ఆన్లైన్ చేయటంలో బ్యాంకర్లు కూడా ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వని కారణంగా లబ్ధిదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి జి.కొండూరు మండలంలో జరుగుతున్న లోపాలను సరి చేయాల్సి ఉంది. లేని పక్షంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలు నీరుగారిపోయాయి అని పలువురు పేర్కొంటున్నారు.