by సూర్య | Wed, Jan 13, 2021, 02:15 PM
ఇటీవలే పౌల్ట్రీ బిజినెస్ లోకి అడుగుపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై బర్డ్ఫ్లూ ఎఫెక్ట్ పడింది. అతని కోళ్ల ఫామ్ కోసం పెంచిన 2500 కడక్నాథ్ కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృతిచెందాయి. ఎన్టీ న్యూస్ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. కడక్ నాథ్ కోళ్లకు ప్రఖ్యాతి గాంచిన ఆ రాష్ట్రంలోని ఝబువా జిల్లాలో కూడా బర్డ్ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. రుదిపాండా గ్రామంలో ఉన్న కడక్నాథ్ కోళ్ల ఫారంలోని కోళ్లకు హెచ్5ఎన్1 వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ కోళ్ల ఫారం చుట్టూ కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తాన్నీ ఇన్ఫెక్టెడ్ జోన్ గా అధికారులు గుర్తించారు. అక్కడ ఉన్న అన్ని పక్షులనూ చంపనున్నట్లు ఝబువా కలెక్టర్ వెల్లడించారు.
అయితే తనకు ధోనీ నుంచి 2000 కడక్నాథ్ కోళ్ల కోసం ఆర్డర్ వచ్చినట్లు ఈ కోళ్ల ఫారం యజమాని వినోద్ మేదా తెలిపాడు. గత నెలలోనే ఈ ఆర్డర్ వచ్చిందని చెప్పాడు. అయితే వాతావరణం సరిగా లేక వాటిని డెలివర్ చేయలేకపోయామని తెలిపాడు. ధోనీ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత ఈ లాభసాటి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.