by సూర్య | Sun, Jan 10, 2021, 01:28 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ మొండిగా వ్యవహరించి ముందుకెళ్తే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తమకు ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమన్నారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని రెండు నెలలుగా ఎన్నికల కమిషన్ను కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొనడం సాధ్యం కాదని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ను సత్వరం ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల వాయిదా కోసం అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతోందన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రాయితీలను భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి తప్పకుండా సాధించుకుంటామని చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Latest News