by సూర్య | Sat, Jan 09, 2021, 02:09 PM
చైనాలో ఇప్పటికీ కరోనా వైరస్ పై ఆందోళన కొనసాగుతోంది. తాజాగా రెండు నగరాలపై ఆ దేశం తీసుకున్న కఠిన చర్యలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బీజింగ్ కు దక్షిణాన ఉన్న రెండు సిటీలను చైనా పూర్తిగా సీజ్ చేసింది. ఆ నగరాలకు రవాణా వ్యవస్థను కూడా ఆపేసింది. బయటి వారు అక్కడకు వెళ్లడానికి, అక్కడున్న వారు బయటకు రావడానికి వీల్లేకుండా చేసింది. దీనికంతటికీ కారణం కరోనానే. అక్కడి అధికారులు చెపుతున్న దాని ప్రకారం హెబీ ప్రావిన్స్ లోని షిజియాజువాంగ్ నగరంలో తాజాగా 127 కరోనా కేసులు బయటపడ్డాయి. వీటికి తోడు అసింప్టొమేటిక్ లక్షణాలు ఉన్న మరో 183 మందిని గుర్తించారు. ఈ సిటీకి పక్కనే ఉన్న జింగ్టాయ్ నగరంలో కూడా తొమ్మిది కేసులు బయటపడ్డాయి. ఈ కేసులు అక్కడి అధికారులు అఫీషియల్ గా ప్రకటించినవి మాత్రమే. అనధికారికంగా ఎన్ని కేసులు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో, ఈ రెండు సిటీలను చైనా సీజ్ చేసింది. తద్వారా వైరస్ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు నగరాల్లో దాదాపు 1.80 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారందరినీ చైనా నిర్బంధంలో ఉంచింది.
Latest News