by సూర్య | Wed, Jan 06, 2021, 11:56 AM
మెల్బోర్న్: ఇండియా, ఆస్ట్రేలియా మద్య బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆట ప్రత్యక్షంగా చూడటానికి వచ్చిన ఓ అభిమానికి కరోనా సోకినట్లు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వెల్లడించింది. అయితే ఆ వ్యక్తికి మ్యాచ్ చూసే సమయంలో మాత్రం ఇన్ఫెక్షన్ లేదని తెలిపింది. ఈ ఘటనతో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పటికే అతనితోపాటు కలిసి మ్యాచ్ చూసిన వాళ్లు టెస్టులు చేయించుకొని, ఐసోలేషన్లో ఉండాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (డీహెచ్హెచ్ఎస్) ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 27, జనవరి 27న మెల్బోర్న్ స్టేడియంలోని ది గ్రేట్ సదర్న్ స్టాండ్లో కూర్చొని మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3.30 గంటల వరకు మ్యాచ్ చూసిన వాళ్లు టెస్టులు చేయించుకోవాలని స్పష్టం చేసినట్లు ఎంసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
మ్యాచ్ జరిగే సమయంలో ప్రతి రోజూ స్టేడియంలో భారీ ఎత్తున క్లీనింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు కూడా ఈ సందర్భంగా ఎంసీసీ చెప్పింది. ఇప్పుడా కరోనా సోకిన వ్యక్తి ఉన్న స్టాండ్స్ను మరోసారి శానిటైజ్ చేస్తున్నట్లు తెలిపింది. మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో మొత్తం 275 శానిటైజింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటన తర్వాత సిడ్నీ టెస్ట్కు వచ్చే ప్రతి అభిమాని కచ్చితంగా మాస్క్ వేసుకోవాల్సిందేనన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తామనీ నిర్వాహకులు హెచ్చరించారు.
Latest News