by సూర్య | Fri, Oct 16, 2020, 02:06 PM
పట్నా: దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus) రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను సైతం పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా జనతాదళ్ (JDU) సీనియర్ నాయకుడు, బీహార్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ గురువారం అర్థరాత్రి కరోనాతో కన్నుమూశారు. 69 ఏళ్ల వయసున్న మంత్రి కపిల్ దియోకు ఇటీవల కరోనా సోకడంతో ఆయన పట్నాలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (AIMS) లో చేరి గత కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. కరోనాతోపాటు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న మంత్రి కామత్ పరిస్థితి విషమించడంతో అర్దరాత్రి 1.30గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు.
అయితే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ మరణం పట్ల జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాధరణ కలిగిన మంచి నాయకుడిని కోల్పోయామంటూ బీహార్ సీఎం ట్విట్ చేశారు. ఆయన మరణం రాజకీయ, సామాజిక రంగాల్లో కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సీఎం నితీష్ కుమార్ రాశారు. కామత్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు.
Latest News