by సూర్య | Fri, Oct 16, 2020, 02:24 PM
విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏ కష్టమెుచ్చిందో తెలియదుగానీ ఓ తల్లి తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఇద్దరి అడపిల్లలుతో సహా చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని కొత్తవలస మండలం నరపాం గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం నరపాం గ్రామానికి చెందిన గౌరీ..శ్రీను దంపతులు. ఈ దంపతులకు ఇద్దరమ్మాయిలు సంతానం. శ్రీను లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరిది సొంతూరు గజపతినగరం కాగా అక్కడ నుండి కొత్తవలస మండల తుమ్మికాపల్లి వలస వచ్చి నివాసం ఉంటున్నారు.
అయితే గౌరీకి భర్త శ్రీనివాస్ కి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం గ్రామానికి సమీపంగా ఉన్న చెరువులోకి దూకి గౌరీ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. ఈ ఘటనలో గౌరీతోపాటు సంకీర్తన(7), హాసిని(6) లు ప్రాణాలు విడిచారు. కుటుంబ కలహాలకు గౌరీతోపాటు అభం, శుభం తెలియని చిన్నారులు కూడా చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.