by సూర్య | Sun, Mar 29, 2020, 12:20 PM
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో వలస కార్మికులు నానాయాతన పడుతున్నారు. ఒక్కొక్కరివి ఒక్కో గాథలు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉండడంతో కార్మికులు ఎలాగైనా తమ ఊర్లకు చేరాలని అనుకుంటున్నారు. కొంత మంది వందల కిలోమీటర్లను కూడా లెక్క చేయకుండా తమ ఊర్లకు బాట పట్టారు. మరికొంత మంది రాత్రి పూట ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. కొంత మంది ఆకలి తీర్చుకునేందుకు నరకయాతన పడుతున్నారు. మరి కొంత మంది గమ్యాన్ని చేరలేక చతికిలపడుతున్నారు. ఎంతో మంది ఆకలి తీర్చిన డెలివరీ బాయ్ తన ఊరును చేరే క్రమంలో 100కిలో మీటర్లు నడిచి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక గాథకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని మోర్నే జిల్లాకు రణ్ వీర్ కు 39 సంవత్సరాలు. ఢిల్లీలోని తుగ్లకాబాద్ లోని ఓ రెస్టారెంట్ లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. దీంతో అతను ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మోర్నే జిల్లాకు కాలినడకన తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దాదాపు 100 కిలో మీటర్లు నడిచాడు. ఢిల్లీ ఆగ్రా హైవేలోని కైలాష్ టర్నింగ్ వద్దకు రాగానే గుండెపోటుకు గురై అక్కడికక్కడే చనిపోయాడు. అతనితో పాటు ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. సమాచారమందుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన విషాదకరంగా మారింది.
Latest News