by సూర్య | Thu, Mar 26, 2020, 02:53 PM
పశ్చిమబెంగాల్లో పోలీసులు అత్యుత్సాహం చూపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. బయటకు వచ్చిన ఓ వ్యక్తిపై విచక్షణ రహితంగా వ్యవహరించారు. తమ లాఠీలకు పని చెప్పడంతో దెబ్బలకు తాళలేక ప్రాణాలు వదిలాడు. హౌరా నగరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిత్యావసరాల కోసం వచ్చిన వ్యక్తిని కొట్టడాన్ని పలువురు ఖండించారు. ఈ సంఘటనతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
లాల్ స్వామి(32) అనే వ్యక్తి పాల ప్యాకెట్లు కొనేందుకు వీధిలోకి వచ్చాడు. అక్కడే పహారా కాస్తున్న పోలీసులు అతన్ని గమనించారు . వెంటనే అతని దగ్గరకు వెళ్లి లాఠీతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. పాల ప్యాకెట్ల కోసం వచ్చానని చెబుతున్నా వారు వినిపించుకోలేదు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మరణానికి కారమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆ వ్యక్తి గుండెపోటుతోనే మరణించాడని కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు.
Latest News