by సూర్య | Mon, Mar 23, 2020, 12:05 PM
భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 400 దాటింది. సోమవారం ఉదయం నాటికి దేశంలో 415 మందికి కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కాగా ఒక్క మహారాష్ట్రలోనే కరోనా కేసుల సంఖ్య 89కి చేరింది. ముంబైలో కొత్తగా 14 కరోనా కేసులు నమోదు కాగా, పుణేలో మరో కేసు నమోదైంది. కోవిడ్ బారిన పడి భారత్లో ఇప్పటి వరకూ ఏడుగురు చనిపోగా.. ముంబైలోనే ఇద్దరు మరణించారు. ఒక్క రోజే కరోనా కారణంగా ముగ్గురు చనిపోవడం ఆందోళన కలిగించింది. కరోనాను అడ్డుకోవడం కోసం జనత కర్ఫ్యూను ప్రకటించిన కేంద్రం.. రైళ్లను రద్దు చేసింది.
తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో దేశంలో రవాణా సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ విషయంలో రాష్ట్రాలు సీరియస్గా వ్యవహరించాలని కేంద్రం సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో ఆరుగురికి కరోనా సోకగా.. తెలంగాణలో ఈ సంఖ్య 28కి చేరింది. కరీంనగర్లో ఇండోనేసియన్లను కలిసిన వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Latest News