by సూర్య | Mon, Mar 23, 2020, 11:15 AM
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. అందరూ ఆరోగ్య సూచనలు పాటించాలని ఆయన సోమవారం ట్విటర్ వేదికగా సూచించారు. ‘లాక్డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదు. దీన్ని ఎందుకు అమలు చేశామో గుర్తించాలి. లాక్డౌన్ను తీవ్రంగా పరిగణించి ప్రజలు అందరూ ఆచరించాలి. ప్రతి ఒక్కరూ విధిగా లాక్డౌన్ నియమాలు పాటించాలి. మనల్ని మనం రక్షించుకోవడానికే లాక్డౌన్ విధించాం. దీని గురించి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి’ అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా దాదాపు 80 జిల్లాల్లో లాక్డౌన్ విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ ఈ ఉదయం నుంచి కొనసాగుతోంది. మార్చి 31వరకు ఇది కొనసాగనుంది.
Latest News