by సూర్య | Sat, Mar 21, 2020, 11:33 AM
కోవిడ్ - 19 వైరస్పై ప్రధాని మోదీ ప్రకటించిన యుద్ధంలో భాగంగా ఆదివారం నిర్వహించబోతున్న జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సంఘీభావం ప్రకటించింది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య రైళ్ల సేవలను నిలుపుదల చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7 గంటల లోపు రన్నింగ్లో ఉన్న రైళ్లు యథాతథంగా నడుస్తాయి. కోవిడ్ వైరస్ నియంత్రణను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలను నిలువరించడానికి వీలుగా ప్రజలను ఇంటి దగ్గరే ఉంచడానికి రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఆరోజున విజయవాడ డివిజన్ నుంచి బయలుదేరే అన్ని పాసింజర్ రైళ్లు నిలిపివేయనున్నారు. విజయవాడ నుంచి నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లు నిలిచిపోనున్నాయి. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లలో విజయవాడ-చెన్నై మార్గంలో నడిచే పినాకిని, విజయవాడ-విశాఖపట్నం మార్గంలో నడిచే రత్నాచల్, విజయవాడ - హైదరాబాద్ మార్గంలో నడిచే శాతవాహన, విజయవాడ- గూడూరు మధ్య నడిచే విక్రమ సింహపురి, విజయవాడ-విశాఖల మధ్య నడిచే డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్లు, గుంటూరు- వైజాగ్ల నడుమ నడిచే సింహాద్రి ఇంటర్ సిటీఎక్స్ప్రెస్లు నిలిచిపోనున్నాయి. సాయంత్రం విజయవాడ మీదుగా హైదరాబాద్, చెన్నైల నుంచి నడిచే చార్మినార్ ఎక్స్ప్రెస్ యథాతథంగానే నడుస్తుంది.
Latest News