by సూర్య | Sat, Feb 15, 2020, 02:14 PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి రైతులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ బీజేపీ నాయకులూ రాజధాని అమరావతికి అండగా ఉంటామని మాట ఇచ్చారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని.. అయితే, అమరావతి రాజధాని అనే నిర్ణయాన్ని గత ప్రభుత్వ హయాంలోనే తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు రాజధానిని మార్చే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని అయన అన్నారు. రాజధానిని కదిలిస్తామని చెప్పడం అవగాహనారాహిత్యమని చెప్పారు. అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ఈరోజు పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు.
అమరావతిని గత ప్రభుత్వం నిర్ణయించినప్పుడు... వైసీపీ కూడా అంగీకరించిందని పవన్ అన్నారు. ఇప్పడు రాజధానిని మారుస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని బీజేపీ పెద్దలు కూడా చెప్పారని అన్నారు. రాజధాని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని చెప్పారు. రాజధాని రైతులు, మహిళలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రైతులకు మద్దతుగా ర్యాలీలు చేద్దామని గతంలో అనుకున్నామని... అయితే ఢిల్లీ ఎన్నికల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశామని.. త్వరలోనే ర్యాలీలను నిర్వహిద్దామని చెప్పారు. ఓట్ల కోసం తాను రాలేదని... రైతులకు భరోసా ఇవ్వడానికే వచ్చానని తెలిపారు.