by సూర్య | Fri, Feb 14, 2020, 02:25 PM
అరుదైన ఘనతకు గుర్తుగా ఇచ్చిన జ్ఞాపికను ఎవరైనా ఏం చేస్తారు? ఎంతో జాగ్రత్తగా దాచుకుంటారు. సమయం దొరికినప్పుడుల్లా దానిని శుభ్రం చేస్తూ కాపాడుకుంటారు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారం అందుకున్న యువ యశస్వి జైశ్వాల్ మాత్రం ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాడు. దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చాక చూస్తే అతడి ట్రోఫీ రెండు ముక్కలైకనిపించింది. అదెలా జరిగిందో మాత్రం అతడికి గుర్తులేదట! ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత జట్టు బంగ్లాదేశ్ చేతిలో త్రుటిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. జైశ్వాల్ మాత్రం 88, 105*, 62, 57*, 59తో మొత్తం 400 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీ విరిగినప్పటికీ జైశ్వాల్ బాధపడడని అతడి కోచ్ జ్వాలాసింగ్ వెల్లడించారు. ‘ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. అతడు ఎక్కువగా పరుగుల గురించే ఆలోచిస్తాడు. ట్రోఫీల గురించి అతిగా పట్టించుకోడు’ అని ఆయన అన్నారు. మరోవైపు ఫైనల్లో చెత్త షాట్ ఆడి ఔటైనందుకు జైశ్వాల్ బాధపడుతున్నాడు. ‘నేను చెత్త షాట్ ఆడాను. ఆ సమయంలో అది అనవసరం. నేను ఊహించిన దానికన్నా బంతి చాలా వేగంగా వచ్చింది. అంతకు ముందే నెమ్మదిగా వస్తున్న బంతిని ఎదుర్కొన్నాను. ప్రపంచకప్ గెలిస్తే బాగుండేది. కానీ దీంతోనే ప్రపంచం ముగిసిపోదుగా’ అని ఈ యువ ఆటగాడు అంటున్నాడు.