by సూర్య | Fri, Feb 14, 2020, 02:01 PM
టీమ్ఇండియా యువ వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్కు తుది జట్టులో చోటివ్వకపోవడంపై దిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వు బెంచీపై కూర్చోబెట్టేందుకే అయితే ఎంపిక చేయడం ఎందుకని ప్రశ్నించారు. న్యూజిలాండ్తో ఆఖరి వన్డేలో పంత్ను ఆడిచకపోవడం ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఇవి ఆలస్యంగా వైరల్ అయ్యాయి. ‘బెంచీపై కూర్చోబెట్టేందుకే అయితే రిషభ్ పంత్ను ఎందుకు ఎంపిక చేయడం? న్యూజిలాండ్-ఏ తో, దేశవాళీ క్రికెటైనా ఆడితే అతడు ప్రయోజనం పొందుతాడుగా? అతడి లాంటి ప్రతిభావంతుడు ఐదో టీ20, ఇప్పుడు మూడో వన్డేలో ఆడకపోవడంలో అర్థం లేదు’ అని పార్థ్ జిందాల్ ట్వీట్ చేశారు. అశ్విన్ గురించీ ఆయన ప్రశ్నించారు. ‘రవిచంద్రన్ అశ్విన్ జట్టులో ఎందుకు లేడో తెలియదు! వికెట్లు తీసేవారంటే తిరస్కారంగా కనిపిస్తోంది! టీ20 సిరీస్లో కివీస్ను వైట్వాష్ చేశాక ప్రపంచకప్ సెమీస్లో తమ విజయం గాలివాటం కాదని ఆ జట్టు నిరూపించింది. భారత్కు వికెట్లు తీసేవాళ్లు, ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న ఆటగాళ్లు అవసరం’ అని జిందాల్ అన్నారు. ఇప్పుడు పంత్ను కూర్చోబెట్టినట్టే రాహుల్ను సైతం చాన్నాళ్లు ఎంపిక చేసి చోటివ్వలేదు. ప్రస్తుతం అతడు తన విలువ తెలుసుకొని అద్భుతంగా ఆడుతున్న సంగతి తెలిసిందే.
Latest News