by సూర్య | Fri, Feb 14, 2020, 01:42 PM
గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇప్పటికే 14 వేల ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం తాజాగా ఆ పోస్టులను భర్తీ చేసేందుకు మార్చి చివరి వారంలో రాత పరీక్షను నిర్వహించేందుకు సిద్దమైనది. అంతేకాకుండా దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలను ఏపీపీఎస్సీ బోర్డు అప్పగించింది. ప్రశ్నపత్రం రూపొందించిన దగ్గర నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం వరకు అన్ని కూడా బోర్డు పర్యవేక్షణలోనే జరగనున్నాయి.
ఇదిలా ఉంటే రాత పరీక్షను 3-4 రోజులు నిర్వహించి.. ఆ తర్వాత వారం రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారు. ఇక మెరిట్ లిస్ట్ ఆధారంగా డీఎస్సీకి బాధ్యతలను అప్పగించాలని చూస్తున్నారు. కాగా, గతంలోనే 14,061 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గడువు తేదీ ముగిసే సమయానికి సుమారు 11,06,614 మంది అప్లై చేసుకున్నారు.