by సూర్య | Fri, Jan 17, 2020, 03:08 PM
మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాజ్కోట్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్ది సేపట్లో రెండో వన్డే జరగనుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఆసీస్ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. మరోవైపు ఈ వన్డే కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు మార్పులు చేసాడు. పేసర్ శార్దూల్ ఠాకూర్ బదులు నవదీప్ సైనీ జట్టులోకి వచ్చాడు. ఇక గాయపడ్డ వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో మనీష్ పాండే ఆడుతున్నాడు. పాండే 2018 సెప్టెంబర్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ తర్వాత తొలిసారి వన్డే ఆడుతున్నాడు. పాండేకు 35 వన్డేల తర్వాత చోటు దక్కింది. 2018లో తన చివరి వన్డే తర్వాత మనీష్ 27 లిస్ట్-ఎ ఇన్నింగ్స్లు ఆడి.. 4 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు చేసాడు. 84.05 సగటుతో 1,429 పరుగులు చేశాడు. మనీష్ పాండే ఇప్పటివరకు భారత్ తరఫున 23 వన్డేలు ఆడి 440 పరుగులు చేసాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 33 టీ20లలో 618 పరుగులు చేసాడు. రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోర్ 79. అయితే పాండే ఇప్పటివరకు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.
Latest News