by సూర్య | Sun, Jan 12, 2020, 03:52 PM
భారత్-ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల పోరుకు సిద్ధమవుతున్నాయి. జనవరి 14న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఇక ఇరుజట్ల మధ్య 2020 చివరలో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో కోహ్లీసేన పర్యటించనుంది. ఈ సిరీస్కు ఎంతో సమయం ఉన్నప్పటికీ అప్పుడే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాజీ క్రీడాకారులు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టీవ్ వా మాట్లాడుతూ... 'భారత్-ఆస్ట్రేలియా తలపడే ఏ సిరీస్ అయినా ఆసక్తికరంగానే ఉంటుంది. సిరీస్ ఏదైనా గొప్పదే. ఇదో సంప్రదాయంగా మారింది. అప్పుడే 2020 చివర్లో పర్యటనపై ఆసక్తి పెరిగిపోతోంది. స్మిత్, వార్నర్తో ఆసీస్ జట్టు మరింత బలపడింది. కోహ్లీసేన అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. అందుకే ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుంది. ఆస్ట్రేలియాలో గులాబి టెస్టు ఆడటం సవాలే. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు దానిని స్వాగతిస్తాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు ఏదైనా పరిస్థితులు, ప్రదేశంతో సంబంధం లేకుండా గెలవాలనే కోరుకుంటుంది. భారత్ అందుకు మినహాయింపేమీ కాదు' స్టీవ్ వా అన్నాడు. 'భారత్-ఆస్ట్రేలియా రెండు జట్లు కఠినమైన క్రికెట్ ఆడుతున్నాయి. అయితే ఆస్ట్రేలియాకు ఉత్సాహకరమైన లైనప్ ఉంది. మార్నస్ లబుషేన్ వంటి కొత్త ఆటగాళ్లు ఉన్నారు. స్మిత్, వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆసీస్ చాలా వేగంగా, బలంగా పుంజుకుంది. భారత్లో కోహ్లీసేనను ఓడించడం వారిలో ఆత్మవిశ్వాసం నింపింది. ఐసీసీ టోర్నీలు కైవసం చేసుకోవడం సులభం కాదు. భారత్కు వాటిని సాధించే సామర్థ్యం ఉంది. ఏ టోర్నీలోనైనా వారు గట్టి పోటీదారులు. భారత అభిమానులు సహనంతో ఉండాలి. మరో పెద్ద టోర్నీ గెలిచేందుకు టీమిండియాకు ఎక్కువ సమయం పట్టదు' అని స్టీవ్ వా పేర్కొన్నాడు.
Latest News