by సూర్య | Mon, Oct 14, 2019, 03:44 PM
ముంబయి: బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నామినేషన్ వేశారు. ముంబయిలోని బీసీసీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షులు నిరంజన్ షా, ఎన్ శ్రీనివాసన్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఉన్నారు. గంగూలీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కోశాధికారిగా అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ ధూమల్ నామినేషన్ వేశారు. అక్టోబరు 23న బీసీసీఐ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు నేటితో ఆఖరి తేదీ. ఇప్పటివరకు అధ్యక్ష పదవికి గంగూలీ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఇక లాంఛనప్రాయమే అవనుంది. తొలుత అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ సన్నిహితుడు బ్రిజేష్ పటేల్ నుంచి గట్టి పోటీ వచ్చినప్పటికీ.. ఆదివారం జరిగిన అనధికారిక సమావేశంలో అనేక రాష్ట్రాల సంఘాల ప్రతినిధులు గంగూలీకే మద్దతు పలికినట్లు తెలిసింది.
Latest News