by సూర్య | Sat, Oct 12, 2019, 10:45 PM
తమిళనాడులోని మదురైకి చెందిన 40 ఏళ్ల ఫ్రీలాన్స్ టూరిస్ట్ గైడ్ నాగేంద్ర ప్రభు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాడు. అతను కల్లో కూడా ఊహించని విధంగా దేశవ్యాప్తంగా అతని పేరు వినిపిస్తోంది. గడచిన 33 సంవత్సరాలుగా భరతనాట్యం కళాకారుడు కావాలన్న ఆయన కల తీరనప్పటికీ భరతనాట్యంలో ఆయనకు ఉన్న ప్రావీణ్యం దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఏడేళ్ల చిరుప్రాయం నుంచే నాట్యం నేర్చుకోవాలని తపించిన ఆయన తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు తన కోరికను చంపుకుని చదువుపై ధ్యాసపెట్టవలసి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తండ్రయిన ఆయన నాట్య కళాకారుడు కావాలన్న ఆశను వదిలేసుకుని ఫ్రీలాన్స్ టూర్ గైడ్గా జీవితం కొనసాగిస్తున్నారు. అయితే, ఇటీవల ప్రసిద్ధ ఆలయాలకు నెలవైన మదురైలో కొందరు కెనడా పర్యాటకులకు హిందూ దేవాలయాల ప్రాశస్తాన్ని, శిల్ప వైభవాన్ని వివరించే క్రమంలో ప్రభు ప్రదర్శించిన నాట్య భంగిమలు వీడియో రూపంలో సోషల్ మీడియాలో బయటకు వచ్చి వైరల్ అయ్యాయి. ఈ వీడియో చూసి ప్రభు ప్రతిభకు ముగ్ధుడైపోయిన నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ తన జీవితంలో ఇంతటి ఉత్తమ టూరిస్ట్ గైడ్ను చూడలేదని ప్రశంసించారు. అంతేగాక తమిళనాడు పురావస్తు శాఖ అధికారులకు ఆయన లేఖ కూడా రాశారు. తాను ప్రదర్శించిన నాట్య భంగిమలు అన్నీ భరతనాట్య కళాకారులను చూసి నేర్చుకున్నవేనని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఎ, ఎంఫిల్ చేసి ఒక ప్రైవేట్ స్కూలులో చరిత్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రభు చెబుతున్నారు. భారతదేశ ఘనచరిత్ర, సంస్కృతిని విదేశీయులకు చాటిచెప్పాలన్న ఉద్దేశంతోనే తాను ఫ్రీలాన్స్ టూరిస్ట్ గైడ్గా 2006 నుంచి పనిచేస్తున్నానని ఆయన అంటున్నారు. తనకు భరతనాట్యం నేర్చుకునే ఉద్దేశం ఇప్పుడు లేదని, నాట్య భంగిమలను, హావభావాలను తనదైన శైలిలో చూపించడానికే తాను ఇష్టపడతానని ఆయన చెప్పారు.
Latest News