by సూర్య | Sat, Oct 12, 2019, 11:41 AM
ఏపీ సీఎం జగన్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మరో హామీని నెరవేర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూనియర్ లాయర్లకు నెలకు రూ.5 వేల రూపాయల స్టైఫండ్ ఇస్తామన్న హామీని నవంబర్ 2 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన జీవోను సర్కార్ ఈ నెల 14న విడుదల చేయనుంది. కొత్తగా లా పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరపడే వరకు అంటే దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఈ స్టైఫండ్ అమలు చేయనున్నారు.
దీనికి సంబంధించిన దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్లకు పంపిస్తారు. వీరి నుంచి అర్హులైన అభ్యర్దులు దరఖాస్తులు నింపి తిరిగి వారికి సమర్పించాలి. వారి దగ్గరి నుంచి దరఖాస్తులను తీసుకొని తనిఖీల అనంతరం అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు, గ్రామాలల్లో ఎంపీడీవోలకు పంపుతారు. వారు పరిశీలించాక జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపుతారు. అర్హులైన వారి వివరాలను సీఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో ఉంచుతారు. అర్హులైన జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.
అర్హులైన జూనియర్ లాయర్లకు నవంబర్ 2న నిర్దేశించిన బ్యాంకు ఖాతాల్లో ఆ మేరకు నగదు జమ చేయనున్నారు. నవంబర్ 3వ తేదీన లబ్ధిదారులకు నగదు జమకు సంబంధించిన రశీదులతో పాటు సీఎం జగన్ సందేశాన్ని గ్రామ వలంటీర్లు డోర్ డెలివరీ చేయనున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ యువ లాయర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Latest News