by సూర్య | Sat, Oct 12, 2019, 10:35 AM
అమరావతి : శ్రీశైలం డ్యాంకు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుని నిండు కుండలా మారింది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి కేవలం 7 పాయింట్లు, నాలుగు టీఎంసీలు మాత్రమే తక్కువగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా అన్ని యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం నీటిమట్టం గురువారం సాయంత్రం 6గంటల సమయానికి 884.30 అడుగులు, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 211.4759 టీఎంసీలుగా నమోదయ్యాయి. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వలు 215.8070 టీఎంసీలు.
జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 46,439 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 22,060 క్యూసెక్కులు మొత్తం జలాశయానికి 68,499 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రవహిస్తోంది.శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 26,535 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు.ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 42,378 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. మొత్తం జలాశయం నుంచి ఔట్ఫ్లోగా 68,913 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.గడచిన 24గంటల వ్యవధిలో శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల నుంచి 32.984 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తిచేసి గ్రిడ్కు అందించారు. గడచిన 24గంటల వ్యవధిలో జలాశయానికి 70,424 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి 98,277 క్యూసెక్కుల నీటిని ఔట్ఫ్లోగా విడుదల చేశారు.
Latest News