by సూర్య | Thu, Aug 22, 2019, 07:14 PM
అమెరికాలో అత్యధిక ప్రజాదరణ ఉన్న విదేశీ నేతల్లో పోప్ ఫ్రాన్సిస్ తర్వాత స్థానం భారత ప్రధాని మోదీదే. వచ్చే నెల 22న టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ స్టేడియంలో జరిగే సభకు ఆయన హాజరు కానున్నారు. హౌడీ మోదీ అనే నినాదంతో టెక్సాస్ ఇండియా ఫోరమ్ (టిఫ్) ఈ కమ్యూనిటీ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ స్టేడియంలో 50 వేల మంది కూర్చునే అవకాశముంది. ఇప్పటికే టికెట్లు అన్నీ అమ్ముడుపోవడం విశేషం. 'హౌ డూ యూ డూ'ని అమెరికా నైరుతి ప్రాంతంలో హౌడీగా పిలుస్తారు. మోదీ మద్దతుదారులు ఈ నినాదాన్ని బాగా ప్రచారం చేసుకున్నారు. హ్యూస్టన్లో ఐదు లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. ఇది అమెరికాకు ఇంధన రాజధాని. ఈ రంగంలో భారత్లో పెట్టుబడులు పెట్టేలా ఆయా కంపెనీలను అకర్షించేందుకు మోదీ ఈ పర్యటనను ఉపయోగించుకోనున్నారు. భారత్ అభివృద్ధి, అమెరికా-భారత్ భాగస్వామ్యంపై తన విజన్ ఏమిటో ఈ సందర్భంగా వివరిస్తారు. ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అమెరికా, భారత్లలో 100 కోట్ల మంది దీనిని వీక్షిస్తారని అంచనా.