by సూర్య | Thu, Aug 22, 2019, 04:49 PM
ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి రఫేల్ యుద్ధ విమానం సెప్టెంబరు 20న భారత దేశానికి అందుతుంది. దీనిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీ ఎస్ ధనోవా స్వీకరిస్తారు. రక్షణ శాఖ వర్గాలు ఈ వివరాలను వెల్లడించాయి. రఫేల్ యుద్ధ విమానాల తయారీ కర్మాగారం బోర్డాక్స్లో ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఓ బృందం ఫ్రాన్స్ వెళ్ళి, బోర్డాక్స్లోని ఈ కర్మాగారం వద్ద ఈ యుద్ధ విమానాన్ని స్వీకరిస్తుంది. ఈ విమానం ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ ఉయోగిస్తున్నదాని కన్నా అత్యంత అధునాతనమైనది. భారతీయ పైలట్లకు వచ్చే ఏడాది మే వరకు ఈ విమానాన్ని నడపటంలో శిక్షణ ఇస్తారు. 24 మంది పైలట్లను మూడు బృందాలుగా విభజించి శిక్షణ ఇస్తారు.
రఫేల్ యుద్ధ విమానాలకు భారత దేశం కోరుకున్న మార్పులను చేశారు. హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్లోని హషిమర స్థావరాల్లో వీటిని ఉంచుతారు. 2016 సెప్టెంబరులో ఫ్రెంచ్ ప్రభుత్వం, డసాల్ట్ ఏవియేషన్తో భారత ప్రభుత్వం 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది.
Latest News