వైసీపీపై సుజనాచౌదరి ఫైర్
by సూర్య |
Wed, Aug 21, 2019, 08:43 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి. ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఉందా అంటూ నిలదీశారు. అధికారంలోకి వచ్చి 3నెలలు అయినా ఇప్పటికీ సరైన పాలన అందించడం లేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరద రాజకీయాలతో తిట్టుకుంటున్నారే తప్ప ప్రజలను పట్టించుకుంటున్నారా అంటూ నిలదీశారు.
ఒకేసారి లక్షల క్యూసెక్కుల నీటిని ఎలా వదిలేస్తారని నిలదీశారు. పై నుంచి ఆగష్టు 9 వరకు లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతున్న ఎందుకు విడుదల చేయకపోయారో చెప్పాలని నిలదీశారు. సీ డబ్ల్యూసీ హెచ్చరించినా పట్టించుకోలేదని విమర్శించారు. చేతగానితనమా లేక రాజధానిని ముంచాలనే కుట్రలో భాగమా అంటూ ప్రశ్నించారు. వరదలు వచ్చి వారం దాటుతున్నా ఇప్పటికీ వరద బాధితులకు సరైన సహాయం అందించలేదని విరుచుకుపడ్డారు. ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటి చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు.
చంద్రబాబు ఇంటిని ముంచడమే పనిగా పెట్టుకుని రైతుల భూములు ముంచేశారని ఆరోపించారు. రాజధానిని ముంచే కుట్రలో భాగంగానే వరదలు అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదా అని ప్రశ్నించారు.
మరోవైపు రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిపై బొత్స వ్యాఖ్యలు వ్యక్తిగతమా, ప్రభుత్వ పరంగా మాట్లాడారా చెప్పాలని డిమాండ్ చేశారు. బొత్స వ్యాఖ్యలను చూస్తే రాజధాని తరలిపోతుందన్న భావన కలుగుతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని సుజనాచౌదరి డిమాండ్ చేశారు.
రాజధానిపై మంత్రి బొత్స, మరోమంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డిలు విరుద్ధ ప్రకటనలు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు అఖండ విజయాన్ని అందించారని చెప్పుకొచ్చారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ ఇకపై పరిపాలనపై దృష్టిపెట్టాలని సూచించారు.
Latest News