by సూర్య | Wed, Aug 21, 2019, 06:06 PM
నవ్యాంధ్ర రాజధానిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాక రేపుతున్నాయి. బొత్స వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరుగుతుంటే బొత్స వ్యాఖ్యలను వక్రీక రించారంటూ వైసీపీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది.
మంత్రి బొత్స వ్యాఖ్యలపై టీడీపీ చేస్తున్న విమర్శలను ఖండించారు మంత్రి అవంతి శ్రీనివాస్. రాజధాని అమరావతిపై మంత్రి బొత్స తన పరిధిలోని అంశాల గురించి చెప్పారని రాజధాని పై పూర్తి నిర్ణయం సీఎం జగన్ తీసుకుంటారని చెప్పుకొచ్చారు.
రాజధానిని మార్చేస్తామని మంత్రి బొత్స ఎక్కడా వ్యాఖ్యానించ లేదన్నారు. ఇటీవల వచ్చిన వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఇలాంటి తరుణంలో రాజధాని అంశం అప్రస్తుతం అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని మళ్లీ కొత్త సమస్యలు సృష్టించుకోవడం మంచి పద్దతి కాదని అవంతి శ్రీనివాస్ హితవు పలికారు.
గడచిన ఐదేళ్లలో తాత్కాలిక సెక్రటేరియంట్, తాత్కాలిక అసెంబ్లీ తప్ప రాజధానిలో ఇంకేమైనా కట్టారా అంటూ తెలుగుదేశంపై మండిపడ్డారు. అసలు రాజధానిలో టీడీపీ కట్టింది ఏమిటో తాము ఆపేసిందో ఏమిటో క్లారిటీగా చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రశ్నించారు మంత్రి అవంతి శ్రీనివాస్.