by సూర్య | Tue, Aug 20, 2019, 07:34 PM
విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కృష్ణా కరకట్ట వెంబడి తెదేపా అధినేత చంద్రబాబు మంగళవారం పర్యటించారు. వరద బాధితులను పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద సహాయక చర్యల్ని ప్రభుత్వం సమర్థంగా చేపట్టలేదని.. నీటి నిర్వహణలో పూర్తిగా విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. కరకట్ట రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయాలన్నది అందరి డిమాండ్ అని.. ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలన్నారు. వరద బాధితులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడి నుంచి ప్రజల్ని తరలిస్తామని మంత్రులు అనడం తగదన్నారు. ఇవి కృత్రిమంగా వచ్చిన వరదలని.. తన ఇల్లు ముంచడానికే ప్రజల ఇళ్లను ముంచారని ఆయన వ్యాఖ్యానించారు. జలాశయాలను నింపే ప్రయత్నం చేయకుండా నీటిని ఇళ్లపైకి వదిలారని విమర్శించారు. మంత్రులు తన ఇంటి చుట్టూ తిరిగారు తప్ప ప్రజల బాగోగులను పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి బాధితుల్ని ఆదుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఇసుక దొరకదు.. అన్న క్యాంటీన్ తెరవరు అంటూ ఆయన ధ్వజమెత్తారు.
Latest News