by సూర్య | Mon, Jun 24, 2019, 05:59 PM
జార్ఖండ్: జార్ఖండ్లో దొంగతనం చేశాడన్న అనుమానంతో ఓ యువకున్ని దారుణంగా కొట్టారు. సుమారు 18 గంటల పాటు అతన్ని చిత్రవధకు గురిచేశారు. దెబ్బలు తట్టుకోలేక ఆ యువకుడు చనిపోయాడు. ఈ విషాద ఘటన ఖర్సవాన్ జిల్లాలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి అయిదుగుర్ని అరెస్టు చేశారు. ఇద్దరు పోలీసు ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేశారు. అయితే ఈ దాడిని కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఖండించారు. బీజేపీ పాలిత జార్ఖండ్లో ఈ ఘటన జరిగిందన్నారు. జై శ్రీరామ్ అని అనకపోవడం వల్ల దాడి చేశారని ఆరోపించారు. ఇదేనా ఎన్డీఏ 2.0 ప్రభుత్వం అంటూ ఆమె ప్రశ్నించారు. ఇదేం పద్ధతి, అందరి విశ్వాసం గెలవడం అంటే ఇదేనా అని ఆమె అన్నారు. మహారాష్ర్టలోని పుణేలో వెల్డర్గా పనిచేస్తున్న తబ్రేజ్ అన్సారీ (24) ఈద్ పండుగకు ఖర్సవాన్ జిల్లాలోని తన స్వగ్రామాని కి వచ్చాడు. ఇటీవల పెండ్లి చేసుకున్న అతడు కుటుంబ సభ్యులతో పండుగను జరుపుకొని, ఈ నెల 18న జంషెడ్పూర్కి మరో ఇద్దరితో తిరుగు ప్రయాణమయ్యాడు. దత్కిది గ్రామానికి చేరుకున్న వీరిని అనుమానాస్పద వ్యక్తులుగా భావిస్తూ గ్రామస్థులు ప్రశ్నించారు. ముగ్గురిలో ఇద్దరు పారిపోగా.. తబ్రేజ్ చిక్కాడు. దొంగతనం చేశాడన్న అనుమానంతో కొందరు తబ్రేజ్ను 18 గంటల పాటు కర్రలతో కొడుతూ హింసించారు. తబ్రేజ్ ముస్లిం అని తెలియడంతో దుండగుల్లో కొం దరు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు చేయాలని ఒత్తిడి చేసినట్టు కొన్ని వీడియోల ద్వారా తెలుస్తున్నది. తీవ్ర గాయాల పాలైన తబ్రేజ్ను పోలీసులు సమీప దవాఖానలో చేర్పించి చికిత్సను అందించారు. జూన్ 22న చికిత్స పొందుతూ తబ్రేజ్ మృతిచెందాడు.
Latest News