by సూర్య | Mon, Jun 24, 2019, 12:59 PM
ఏపీలోని 12 జిల్లాల్లో గ్రామ వాలంటీర్ల నియామకం కోసం నిన్న నోటిఫికేషన్ వెలువడింది. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ ను ప్రభుత్వం నియమించబోతోంది. మొత్తం 1,70,543 గ్రామ వాలంటీర్ల కోసం జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో, గ్రామ వాలంటీర్లు ఇంకా ఎంపిక కాకముందే వారికి ముఖ్యమంత్రి జగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవినీతి లేకుండా చేసేందుకే ఒక్కో గ్రామ వాలంటీర్ కు నెలకు రూ. 5 వేల వేతనాన్ని చెల్లించబోతున్నామని అవినీతికి తావు లేకుండా పని చేయాలని చెప్పారు. గ్రామ వాలంటీర్ తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ డోర్ డెలివరీ చేస్తున్నామని జగన్ చెప్పారు. ప్రభుత్వ పథకాలను గ్రామ వాలంటీర్ల ద్వారా అమలు చేస్తామని తెలిపారు.
Latest News