by సూర్య | Thu, Jun 20, 2019, 07:28 PM
ఫ్యామిలీసహా యూరప్ టూర్ వెళ్లిన అధినేత చంద్రబాబు వచ్చేలోపు తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందంటూ వ్యాఖ్యానించారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. టీడీపీ నుంచి నేతలు క్యూలో ఉన్నారని.. అందరూ రావటానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆయన అన్నారు. ఒక్క టీడీపీ నుంచే కాకుండా.. జనసేన నుంచి కూడా భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు రాబోతున్నట్లు ప్రకటించి ఆ రెండు పార్టీల్లో కలకలం రేపారు. చంద్రబాబు వారసత్వం, బానిసత్వం నుంచి విముక్తి లభించిందన్నారు. టీడీపీ నేతలు విముక్తి కోరుకుంటున్నారని.. ఇప్పటికి వారికి మోక్షం లభించిందన్నారు.
కొన్ని రోజుల క్రితమే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఏపీలో బలపడేందుకు చేస్తున్న వ్యూహాల్లో భాగంగా.. టీడీపీ, జనసేన పార్టీల తరపున పోటీ చేసిన నేతలకు వల వేశారు. టీడీపీ సీనియర్ నేతల టచ్ లోకి వెళ్లారు. పార్టీల్లోకి ఆహ్వానించారు. ప్రతి జిల్లా నుంచి కనీసం ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలను తీసుకోవటం ద్వారా స్థానికంగా బలపడొచ్చనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎంపీలందరూ వెళుతున్నట్లు సమాచారం. వారితోపాటు కొంత మంది కీలక నేతలు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో ఏం జరుగుతుంది అనేది అభిమానుల్లో గందరగోళం నెలకొంది. చంద్రబాబు యూరప్ టూర్ లో ఉన్న సమయంలో కీలక నేతలు ఇలా వ్యవహరించటంపై షాక్ అవుతున్నారు.
Latest News