by సూర్య | Fri, Mar 22, 2019, 11:52 PM
తూర్పు-పశ్చిమ గోదావరి పట్టభద్రులు, కృష్ణా-గుంటూరు పట్టభద్రులు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయుల నియోజకవర్గాల పరిధిలో జరిగిన శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. శాసనమండలి ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరగడంలో సహకరించిన అధికారులకు, రాజకీయ పార్టీలకు ప్రతిఒక్కరికి ధన్యావాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇదే తరహాలో సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతిఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. తూర్పుగోదావరిలో 1,72,415 మంది, పశ్చిమగోదావరిలో 1,21,379 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు కలిగివున్నారని, వారిలో 54 శాతం మంది సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా కృష్ణా జిల్లాలో 1,06,829 మంది, గుంటూరు జిల్లాలో 1,41,970 మంది గ్రాడ్యుయేట్లు ఓటుహక్కు కలిగివుండగా వారిలో సాయంత్రం 4 గంటల వరకు సుమారు 45.95 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల కోసం శ్రీకాకుళంలో 5691 మంది ఉపాధ్యాయ ఓటర్లు, విజయనగరంలో 5208 మంది ఉపాధ్యాయ ఓటర్లు, విశాఖపట్నంలో 8694 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసేసరికి ఓటు హక్కును 89.60 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు.
“మై ఓట్ క్యూ” యాప్నకు విశేష స్పందన…
శాసనమండలి ఎన్నికల నేపధ్యంలో ప్రవేశపెట్టిన “మై ఓట్ క్యూ” యాప్ ద్వారా ఓటర్లు వారు ఓటు వేసే పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్ వివరాలను తెలుసుకునే వెసులుబాటును తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం కలెక్టర్లు మై ఓట్ క్యూ పట్ల ఓటర్లు ఆసక్తి కనబరుస్తున్నారని క్యూ లైన్లలో ఎక్కువ సేపు వేచి వుండకుండా, రద్దీకి అనుగుణంగా ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరింతగా మై ఓట్ క్యూ యాప్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు.