తుంబురు తీర్థ ముక్కోటిలో వేలాదిగా పాల్గొన్న భక్తులు
by సూర్య |
Wed, Mar 20, 2019, 07:55 PM
తిరుమలలోని శేషాచల అడవుల్లో ఒకానోక ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థముక్కోటికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఫాల్గుణమాసమున ఉత్తరఫల్గుణీ నక్షత్రముతో కూడిన పౌర్ణమినాడు అనగా మార్చి 20వ తేది బుధవారం తుంబురు తీర్థ ముక్కోటి వున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం 6.00 గంటల నుండి భక్తులు కాలినడకన ఈ తీర్థానికి విచ్చేశారు. బుధవారం సాయంత్రం 6.00 గంట వరకు దాదాపు 18 వేల మంది భక్తులు తుంబురు తీర్థానికి చేరుకున్నారు.
టిటిడి విస్తృత ఏర్పాట్లు : తుంబురు తీర్థానికి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మార్చి 19వ తేదీ ఉదయం 6.00 గంటల నుండి నిరంతరాయంగా ఉదయం, సాయంత్రం పొంగలి, ఉప్మా, కాఫీ, పాలు అందించారు. అదేవిధంగా మధ్యాహ్నం, రాత్రి సాంబరు అన్నం, పెరుగన్నం టమోట అన్నం, బిస్బిలాబాత్, పులిహోరాను భక్తులకు అందిస్తున్నారు. భక్తుల కొరకు 25 వేల తాగునీరు బాటిళ్లు, 65 వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. మార్చి 19వ తేదీ మంగళవారం నుండి మార్చి 21వ తేదీ గురువారం వరకు ప్రతి రోజు 632 మంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, వైద్య విభాగాలతో కలిసి భక్తులకు సేవలందిస్తున్నారు.
ఇంజినీంగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, త్రాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. పాపవినాశనం డ్యాం వద్ద తుంబురు తీర్థానికి వెళ్ళే మార్గంలో రెండు పులిహోర, రెండు మజ్జిగ ప్యాకెట్లు, ఒక తాగునీటి బాటిళ్లు కూడిన ఒక సంచిని టిటిడి భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా పంపిణి చేసింది. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్ళే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్కాస్టింగ్ విభాగం ఆధ్వర్యంలో తరచూ ప్రకటనలు చేశారు.
ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం, పాపావినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ 90 మంది అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు రెండు అంబులెన్స్లను, పారామెడికల్ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. మరోవైపు టిటిడి భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను టిటిడి క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రీ పర్యవేక్షిస్తున్నారు. టిటిడి కల్పించిన అన్నప్రసాదాలు, తాగునీరు, ఇతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Latest News