by సూర్య | Wed, Mar 20, 2019, 07:59 PM
తిరుచానూరులో భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో తిరుమల తరహాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల హాస్టల్ బ్లాక్ను బుధవారం తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతంతో కలిసి ఈవో పరిశీలన చేపట్టారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరును రోజుకు సరాసరి 30 వేల మంది భక్తులు సందర్శిస్తున్నారని, వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. భక్తుల్లో ఆధ్యాత్మిక భావన మరింత పెంచేలా తిరుమల తరహాలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాల్లో గ్రిల్స్ తొలగించి దేవతామూర్తుల శిల్పాలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు. తిరుచానూరులో రథం మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. ఆలయంలోని స్టోర్ గదిని పాత అన్నప్రసాద భవనంలోకి మార్చాలని, అదేవిధంగా ఈ భవనాన్ని భక్తులకు వేచి ఉండే హాలుగా వినియోగించాలని అధికారులకు సూచించామన్నారు. దర్శనానంతరం ఆలయం నుండి భక్తులు తోళప్పగార్డెన్స్లోని నూతన అన్నప్రసాద భవనానికి వెళ్లేందుకు సౌకర్యవంతంగా రోడ్డుకు ఒకవైపున దారి పొడవునా షెడ్ ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించామన్నారు. సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్, పాదరక్షలు భద్రపరుచుకునే కౌంటర్, పుస్తకవిక్రయశాల ఒకేచోట ఉండేలా చర్యలు చేపడతామన్నారు. అంతకుముందు ఆలయం, క్యూలైన్లు, పోటు, పాత అన్నప్రసాద భవనం, పాదరక్షల కౌంటర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.