by సూర్య | Tue, Mar 19, 2019, 01:17 PM
ఉత్తరప్రదేశ్లో బీజేపీను ఓడించే సత్తా బీఎస్పీ-ఎస్పీ కూటమికి ఉందని దానికి కాంగ్రెస్ మద్దతు అవసరం లేదన్న మాయావతి, అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందించారు. ఇరు పక్షాల లక్ష్యం బీజేపీను ఓడించడమేనని అన్నారు. మా కార్యకర్తల్లో గందరగోళం సృష్టించొద్దన్న మాయావతి వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. కాంగ్రెస్ ఏ పార్టీని ప్రభావితం చేయాలనుకోవట్లేదని ప్రియాంక పేర్కొన్నారు. 'మేం ఏ పార్టీలో గందరగోళం సృష్టించాలనుకోవట్లేదు. మాకు ఎవరితో ఇబ్బందులు లేవు.
మా లక్ష్యం బీజేపీను ఓడించడం.. వారి(ఎస్పీ-బీఎస్సీ) లక్ష్యం కూడా అదే' అని ప్రియాంక వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్లు పోటీ చేసే రాయ్బరేలీ, అమేఠీల నుంచి అభ్యర్థులను బరిలోకి దించబోమని ఎస్పీ-బీఎస్పీ కూటమి ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ కూడా ములాయం, అజిత్ సింగ్ సహా ఏడుగురు ప్రముఖ నాయకులు పోటీ చేసే చోట అభ్యర్థులను రంగంలోకి దించకూడదని నిర్ణయించింది. అయితే కాంగ్రెస్ ప్రకటన వల్ల తమ కూటమి కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతుందని మాయావతి, అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. దీనివల్ల రెండు పక్షాలకు మధ్య అంతర్గత ఒప్పందం ఉందనే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. బీజేపీను తమ కూటమి ఒంటరిగా ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించుకోవచ్చని హితవు పలికారు.
Latest News