by సూర్య | Tue, Mar 19, 2019, 01:38 AM
నానాటికీ మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. విజయవాడ మ్యూజియం రోడ్డులోని కేఎల్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్మిషన్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని సీపీ ద్వారకా తిరుమలరావు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ విజయవాడ నగరం విద్యా కేంద్రంగా వేగంగా అభివృద్ది చెందుతోందని నగరంలో జనాభా కూడా గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, అయితే విద్యార్థులకు వారి తల్లి తండ్రులకు కోర్సుల ఎంపికపై కొన్ని సందేహాలు ఉన్నాయని అటువంటి వారికి ఈ కౌన్సిలింగ్ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కేఎల్ విద్యా సంస్థ ఇటీవల సాధించిన నాక్ ఎ++, యూజీసీ కేటగిరి-1 హోదా రికార్డుల పట్ల మేనేజ్మెంట్ను ఆయన అభినందించారు. విద్యార్థుల రక్షణ, క్రమశిక్షణ పట్ల విద్యా సంస్థలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిపి సూచించారు. కేఎల్ డీమ్డ్ విశ్వ విద్యాలయం వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్ మాట్లాడుతూ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగాలలో అనేక ప్రత్యేకతలతో కోర్సులను అందిస్తున్నామని చెప్పారు. ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కేంద్రం విద్యార్థులకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. తొలుత సీపీ ద్వారకా తిరుమలరావు జ్యోతి ప్రజ్వలన చేసి అడ్మిషన్ కౌన్సిలింగ్ కేంద్రంతో పాటు డైరెక్టర్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ ఎల్.ఎస్.ఎస్.రెడ్డి, అడ్మిషన్స్ డైరెక్టర్లు డాక్టర్ జే.శ్రీనివాసరావు, సీ.హెచ్.ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Latest News