by సూర్య | Fri, Jul 26, 2024, 08:16 PM
తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఒక్కొక్క పథకాన్ని ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే అర్హులైన ప్రతీ మహిళ ఖాతాలో నెలకు రూ.1500 ప్రభుత్వం జమ చేయనుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసన మండలిలో ప్రకటన చేశారు.
శాసనమండలిలో మాట్లాడిన మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి కీలక ప్రకటనను వెలువరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు రూ.1500 చొప్పున.. ఏడాదికి రూ. 18 వేలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మహిళలు అంటే ముందు నుంచి ఎంత గౌరవమో అందరికీ తెలుసు అని.. అందుకే వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు.
అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో ఓ ట్వీట్ తెగ వైరల్ అయింది. ఏపీ మహిళామణులకు శుభవార్త.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హులైన ప్రతీ మహిళకు నెలకు రూ.1500 చొప్పున మంజూరు చేయడం జరుగుతుంది' అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలను కూడా అందులో వెల్లడించారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతీ మహిళకు 18 సంవత్సరాలు నిండాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫొటోలు, బర్త్ డే సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్.. దీంతోపాటు ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి. వచ్చే నెలలో ఈ ఆడ బిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కొందరు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే ఆ ట్వీట్ వైరల్ అయిన కొన్ని రోజులకే తాజాగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. శాసనమండలిలో ప్రకటన చేయడం గమనార్హం.
Latest News